చెన్నై: ఏడాది వయసున్న మనవడ్ని అమ్మమ్మ హత్య చేసింది. బాలుడి తలను గోడకు బాది, నోట్లో బిస్కెట్ కవర్ కుక్కి ఊపిరాడకుండా చేసి చంపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం జరిగింది. 50 ఏండ్ల నాగలక్ష్మి అన్బాగం వీధిలోని అద్దె ఇంట్లో ఉంటూ హోటల్లో పని చేసి జీవిస్తున్నది. ఆమె కుమార్తె 24 ఏండ్ల నందినికి నాలుగేండ్ల కిందట సొంత టాక్సీ డ్రైవర్ నిత్యానందంతో పెండ్లి జరిగింది. వారికి నాలుగేండ్ల సాయికృష్ణ, ఏడాది వయసున్న దుర్గేష్ అనే ఇద్దరు బాబులు ఉన్నారు.
కాగా, ఎనిమిది నెలల కిందట నందిని భర్తను వీడి చిన్న కుమారుడు దుర్గేష్తో పుట్టింటికి వచ్చి తల్లి వద్ద ఉంటున్నది. పెద్ద కుమారుడు సాయికృష్ణ విడిపోయిన తండ్రి వద్ద ఉంటున్నాడు. గత వారం రోజులుగా తల్లి నాగలక్ష్మికి ఒంట్లో బాగోలేదు. దీంతో ఆమెకు బదులు కుమార్తె నందిని హోటల్ పనికి వెళ్తున్నది.
ఈ నెల 21న మంగళవారం హోటల్ పనికి వెళ్లిన నందిని రాత్రి 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఏడాది కుమారుడు దుర్గేష్ కనిపించకపోవడంతో తల్లిని అడిగింది. అయితే మనవడు రాత్రి ఏడున్నరకే నిద్రపోయాడని, బాబును ఉయ్యాలలో ఉంచినట్లు చెప్పింది. నందిని ఉయ్యాలలో ఉన్న దుర్గేష్ను చూడగా ఊపిరి ఆడకుండా ఉన్నాడు. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆమె తీసుకెళ్లగా బాబు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ చెప్పారు. దీంతో నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తొలుత అనుమానాస్పద మరణంగా కేసుగా నమోదు చేసిన పోలీసులు పోస్ట్మార్టం కోసం బాబు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే బాబు తలలోని పుర్రె పగులడంతోపాటు గొంతులో బిస్కెట్ రేపర్ కుక్కి ఉన్నట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో హత్య కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు జరిపారు.
అమ్మమ్మ నాగలక్ష్మిని పోలీసులు ప్రశ్నించగా మనవడ్ని తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నది. కారు డ్రైవర్ నిత్యానందంను తన కుమార్తె పెండ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అతడిపై కోపంతోనే బాబును చంపినట్లు చెప్పింది. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.