Gold Seized | భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బలగాలు భగ్నం చేశాయి. 106 బంగారం బిస్కట్లను జప్తు చేశారు. వీటి విలువ సుమారు రూ.8.05 కోట్లు ఉంటుందని అంచనా.
పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలోని విజయ్ పూర్ గ్రామంలో ని ఒక ఇంట్లో బంగారం దాచి పెట్టారన్న సమాచారం అధికారులకు అందింది. దీంతో బీఎస్ఎఫ్ బోర్డర్ ఔట్ పోస్ట్ 32 బెటాలియన్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సంయుక్తంగా శనివారం ఆపరేషన్ నిర్వహించారు.
విజయ్ పూర్ గ్రామంలో డీఆర్ఐ, బీఎస్ఎఫ్ అధికారుల టీం సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఒక ఇంట్లోని చెత్తలో రెండు బ్యాగులు దాచి పెట్టారని తేలింది. ఆ రెండు బ్యాగుల్లో 106 బంగారం బిస్కట్లు ఉన్నాయి. అవి 14.296 కిలోల బరువు ఉంటాయని, వాటి విలువ సుమారు రూ.8.50 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ ఆపరేషన్లో భాగంగా అదే గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ బిస్వాస్, విధాన్ ఘోష్లను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ వాసులు మసూద్, నసీఫ్ ల నుంచి వీరు బంగారం బిస్కట్లు తీసుకున్నట్లు విచారణలో తెలిపారు. నదియా జిల్లాలోని సంతోష్ హైదర్ అనే వ్యక్తిని అప్పగించాల్సి ఉన్నా.. బీఎస్ఎఫ్ తనిఖీలు ముమ్మరం కావడంతో ఒక ఇంట్లో దాచి పెట్టామని విచారణలో చెప్పారు.