గర్మిళ్ల : ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ వెంకన్న అనే అంతర్ రాఫ్ట్ర దొంగను మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఏసీసీ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో నిందితుడు పట్టుబడినట్లు తెలిపారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న వాహనాలు చోరీ చేసి అమ్మడం, ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, చెన్నూర్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో బంగారం, వెండి, నగదు చోరీ చేసినట్లు వివరించారు.
ఈ క్రమంలో బెల్లంపెల్లిలో దొంగతనం చేసేందుకు కారులో వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. నిందితునిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి 423.3 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.30 వేల రూపాయల నగదు, వేట కొడవళ్లు, కత్తులు, ఒక ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. ఈ సమావేశంలో మంచిర్యాల సీఐ బి.నారాయణ, సీసీఎస్ సీఐ అశోక్, ఎస్సై మహేందర్, హెడ్ కానిస్డేబుల్ రామారావు, కానిస్టేబుళ్లు సతీశ్, శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.