న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని చిరాగ్ ఢిల్లీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని చిరాగ్ ఢిల్లీ ఏరియాకు చెందిన బాలిక తల్లిదండ్రులు కుటుంబ తగాదాలతో విడిపోయారు. దాంతో బాలిక తల్లి దగ్గర ఉంటున్నది. ఈ క్రమంలో తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకున్నది. బాలికను ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని పేద పిల్లల ఉచితంగా విద్యనందించే పాఠశాలలో చేర్పించారు. అయితే ఇటీవల ఆ పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో బాలిక ఇంటికి వచ్చింది.
ఆ బాలికపై కన్నేసిన సవతి ఇదే అదనుగా భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరిస్తూ మళ్లీమళ్లీ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చివరికి విసిగిపోయిన బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.