లక్నో: ఒక బాలిక అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 15వ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. ధనవంతులు నివాసం ఉండే విలాసవంతమైన రెసిడెన్సియల్ అపార్ట్మెంట్ సొసైటీ భవనంలో 14 ఏండ్ల బాలిక నివాసం ఉంటున్నది. అయితే ఆమె గురువారం ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలిక అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
మరోవైపు ఆ బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో అన్నది తెలియలేదు. ఆమె ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆ బాలిక కొన్ని రోజులుగా ఒత్తిడితో ఉన్నట్లుగా కనిపించిందని అపార్ట్మెంట్ నివాసితులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు ఇది కారణం కావచ్చని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.