చెన్నై: లైంగిక వేధింపులు భరించలేక ఒక బాలిక ఆత్మహత్య చేసుకున్నది. తమిళనాడులోని కరూర్లో ఈ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏండ్ల బాలిక శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. వితంతువైన తల్లి ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక చాలా సేపటి వరకు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో పొరుగున ఉన్న వృద్ధురాలు అనుమానించి ఆ ఇంటి వద్దకు వెళ్లి తొంగి చూసింది. ఉరికి వేలాడుతున్న బాలికను చూసి షాక్ అయ్యింది. వెంటనే ఆమె తల్లికి, పొరుగున ఉన్న వారికి ఈ విషయం చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాలిక రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి నేను భయపడుతున్నాను. నేను ఈ భూమిపై ఎక్కువ కాలం జీవించి ఇతరులకు సహాయం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఇంత త్వరగా ఈ లోకాన్ని వీడాల్సి వచ్చింది’ అని అందులో పేర్కొంది. తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని, ఈ తీవ్రమైన చర్య తీసుకున్నందుకు తనను క్షమించాలని కోరింది.
మరోవైపు తమిళనాడులో ఇటీవల జరిగిన విద్యార్థినుల ఆత్మహత్య కేసులో ఇది రెండోవది. గత వారం కోయంబత్తూరుకు చెందిన 17 ఏండ్ల బాలిక సూసైడ్ చేసుకున్నది. స్కూల్ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది.