జైపూర్ : రాజస్ధాన్లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలికపై మైనర్ సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాలికపై తమ పొరుగున ఉన్న యువకుడు(20) ఈ అరాచకానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్ట్ 26న బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి రప్పించిన నిందితుడు ఆ సమయంలో అక్కడే ఉన్న మరో నలుగరితో కలిసి సామూహిక లైంగిక దాడికి తెగబడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను హెచ్చరించాడు. ఈ ఘటనతో భయాందోళనకు లోనైన బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబసభ్యులు ఆరా తీయగా నిందితుల దాష్టీకాన్ని వెల్లడించింది. దీంతో బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడితో పాటు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని స్ధానిక సీఐ రామేశ్వర్ లాల్ తెలిపారు.