ఉస్మానియా యూనివర్సిటీ : సరిగా చదవడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటలోని సిరిపురికాలనీలోని మల్లిక నెస్ట్ అపార్ట్మెంట్లో నివాసముండే చరిత (15) నగరంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల మార్కులు తక్కువ వస్తుండడంతో తల్లిదండ్రులు మందలించి, మంచిగా చదవాలని సూచించారు.
సోమవారం ఉదయం ఆన్లైన్ క్లాసులు ఉండడంతో గదిలోకి వెళ్లి కూర్చుంది. మధ్యాహ్నం భోజనం చేసి, తిరిగి రూంలోకి వెళ్లింది. సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చరిత తల్లి గదిలోకి వెళ్లి చూసేసరికి చున్నీతో ఉరి వేసుకుని కొన ఊపిరితో వేలాడుతూ కనిపించింది.
వెంటనే కాళ్లు పైకి లేపి, చరిత సోదరి సహాయంతో చున్నీని కట్ చేసి కిందికిదించారు. వెంటనే చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చరిత కన్నుమూసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.