అహ్మదాబాద్ : 14 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఘటన గుజరాత్లోని బరూచ్ జిల్లా అమోద్ పట్టణంలో కలకలం రేపింది. అమోద్ తాలూకాలోని సర్బన్ గ్రామ శివార్లలో బాధితురాలి మృతదేహాన్ని సోమవారం రాత్రి పోలీసులు గుర్తించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టెల కోసం సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగిరాలేదు. పత్తి చేలో ఆమె విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించడంతో ఈ దారుణం బయటపడిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశామని చెప్పారు. ఘటనా స్ధలాన్ని సీనియర్ పోలీస్ అధికారులు సందర్శించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.