లక్నో : ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ ఘటన నాలుగేండ్ల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసును పోలీసులు ఇప్పుడు ఛేదించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన సవిత అనే మహిళ.. పొరుగింట్లో ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను అంతమొందించాలని సవిత నిర్ణయించుకుంది. దీంతో 2018లో తన ప్రియుడితో కలిసి భర్త చంద్ర వీర్ను హత్య చేసింది. ఆ తర్వాత ప్రియుడు అరుణ్ ఇంట్లోనే ఏడు అడుగుల లోతులో గుంత తవ్వి, చంద్ర వీర్ శవాన్ని పూడ్చి పెట్టారు.
తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్ర వీర్ తమ్ముడి మీదే తనకు అనుమానం ఉందని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే ఇటీవలే పోలీసులకు చంద్రవీర్ మర్డర్పై క్లూ దొరికింది. దీంతో సవితను లోతుగా విచారించడంతో తానే చంపినట్లు ఒప్పుకుంది. అరుణ్తో కలిసి చంద్రవీర్ను కాల్చి చంపామని తెలిపింది. ఆ తర్వాత గొడ్డలితో నరికి శరీరాన్ని పూడ్చిపెట్టినట్లు చెప్పింది. శరీర భాగాలతో పాటు గొడ్డలి, తుపాకీని కూడా గుంతలో నుంచి వెలికి తీశారు పోలీసులు.