వనస్థలిపురం : తనకు బంగారం దొరికిందని చవకగా అమ్ముతానని చెప్పి దంపతులను నమ్మించి రూ.2.30లక్షలకు నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం. విశాఖపట్నం జిల్లా తిమరం గ్రామానికి చెందిన అప్పల పాత్రుడు, నాగమణి దంపతులు వనస్థలి పురంలో నివాసముంటున్నారు.
ఎల్బీనగర్లో మొక్కజొన్న బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి నెల రోజుల క్రితం వీరబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బండి వద్దకు తరచుగా వస్తుండేవాడు. సోమవారం వారి బండి వద్దకు వచ్చిన కేటుగాడు తనకు బంగారం దొరికిందని, కొంత మీకు ఇస్తానని, డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ఒక ముక్కను వారికి ఇచ్చాడు.
దానిని బంగారం షాపులో పరిశీలించగా అసలు బంగారం అని తెలిసింది. దీంతో రూ.2.30లక్షలకు బేరం కుదుర్చు కున్నారు. మంగళవారం వనస్థలిపురం గణేష్ టెంపుల్ సమీపంలో నగదు ఇచ్చి, నగలు తీసుకున్నారు. వాటిని తీసుకుని షాపునకు వెళ్లగా అది నకిలీ అని తెలిసింది.
మొదట అసలు బంగారం చిన్న ముక్క ఇచ్చి, నమ్మకం కుదిరిన తర్వాత నకిలీది అంటగట్టినట్లు గ్రహించారు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.