Death drama | జర్మనీలో 23 ఏళ్ల యువతి తాను చనిపోయినట్లు నమ్మించాలనుకున్నది. తన చావును డ్రమటైజ్ చేసి చూపేందుకు తనలాగే ఉన్న ఓ బాలికను గుర్తించి దారుణంగా హత్యచేసింది. డీఎన్ఏ ఆధారంగా చనిపోయినంది సదరు యువతి కాదని తేల్చడంతో ఆ యువతి కటకటాల వెనక్కివెళ్లింది. ఈ కేసుకు జర్మన్ పోలీసులు ‘ది డోపెల్గ్యాంగర్ మర్డర్’ అనే పేరు పెట్టారు. గతేడాది ఆగస్టు 16న జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా ఇప్పుడు తెరపైకి వచ్చింది.
మ్యూనిచ్లో నివసించే షహరాబాన్ అనే మహిళ ఇన్స్టాగ్రాంలో నకిలీ ప్రొఫైల్ను సృష్టించింది. తనలా కనిపించే చాలా మంది మహిళలను సంప్రదిస్తూ వచ్చింది. అనేక ప్రొఫైల్లను పరిశోధించిన అనంతరం ఒక కాస్మోటిక్ బ్లాగర్ ప్రొఫైల్ను గుర్తించింది. ఖదిద్జా అనే ఈ కాస్మోటిక్ బ్లాగర్ అల్జీరియన్ పౌరురాలు. షహరాబాద్ నివాసానికి దాదాపు 160 కి.మీ దూరంలోని గ్రామంలో ఖదిద్జా నివసిస్తున్నది. ఇద్దరికీ పొడవాటి నల్లటి జుట్టు, గోధుమ వర్ణం ఛాయ దాదాపు ఒకేలా ఉన్నది. షహరాబాన్, ఆమె ప్రియుడు షకీర్.. ఇద్దరు కలిసి ఖదీద్జాను సంప్రదించి ఆమెకు కొన్ని సౌందర్య ఉత్పత్తులను ఇచ్చారు. బిజినెస్ విషయంపై మాట్లాడేందుకు మ్యూనిచ్ తీసుకెళ్లేందుకు ఆమెను ఒప్పించారు. ఖదీద్జాతో కలిసి మ్యూనిచ్కు తిరిగి వస్తుండగా ఓ అడవిలో కారును ఆపి.. ఖదీద్జాపై కత్తితో పొడిచి చంపారు.
ఎంతసేపటికి షహరాబాన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అంతటా వెతికారు. డానుబే నది ఒడ్డున కారు వెనుక సీటులో కనిపించిన మృతదేహం ఆమెదే అని ఆమె తల్లిదండ్రులు భావించారు. నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో అనేక కత్తులు లభించాయి. అయితే, శవపరీక్ష, డీఎన్ఏ పరీక్షల్లో మృతదేహం షహరాబాన్ది కాదని, మరొక బాలికది అని తేలింది. కేసును లోతుగా విచారించిన పోలీసులు షహరాబాన్, షకీర్లను అదుపులోకి తీసుకోవడంతో బాలిక దారుణహత్య బయటపడింది. కుటుంబ కలహాల కారణంగా నిందితురాలు కనిపించకుండా పోవాలని భావించి తాను చనిపోయినట్లు నాటకమాడాలని భావించి బాలికను చంపినట్లు పోలీసులు తెలిపారు. తాను చనిపోయినట్లు అందరూ నమ్మాలనుకున్న షహరాబాన్.. తన మాదిరిగా ఉండే ఖదీద్జాను గుర్తించి హత్య చేసిందని పోలీసులు చెప్పారు.