దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు, డీఐ ప్రమోద్ కుమార్తో కలిసి వివరాలను వెల్లడించారు.
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన వ్యక్తులు శోభ అనే వృద్ధురాలు మెడలో నుంచి 9తులాల రెండు బంగారు గొలుసులను దోచుకుపోయారు. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దోపిడి చేసిన వ్యక్తులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కనుగొన్నారు.
దీంతో పాటు బాధితురాలి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్న కావేటి రాజు పై పోలీసులకు అనుమానం వచ్చి, అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను తమ ఇద్దరు మిత్రులు సాయి గౌడ్, దినేష్ కుమార్తో కలిసి దోపిడికి పాల్పడ్డట్లు అంగీకరించారు.
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సాయి గౌడ్, దినేష్ కుమార్ను వారు వాడిన ద్విచక్ర వాహనం ఆధారంగా కనుగొని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దోపిడికి గురైన సొమ్ముతో పాటు వారు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ రావు తెలిపారు. నిందితులపై 394 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.