కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ నాలుగేండ్ల చిన్నారిపై నాలుగు రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయగా, శుక్రవారం వెలుగు చూసింది.
నాలుగేండ్ల చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు ఆ పాపపై దాడి చేశాయి. పాప అరుపులు విన్న తల్లి రూప ఇంటి బయటకు వచ్చింది. తన బిడ్డను వీధి కుక్కలు చుట్టుముట్టి, గాయపరుస్తున్న దృశ్యాలను చూసి తల్లి తల్లడిల్లిపోయింది. కుక్కల దాడి నుంచి బిడ్డను కాపాడుకుంది. తీవ్ర గాయాలపాలైన కూతురు చరిష్మాను చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. చరిష్మా తలకు 14 కుట్లు పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాప చరిష్మా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.