అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో (Anakapalli) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివ రామకృష్ణ తన కుటుంబంతో కలిసి అనకాపల్లిలో ఉంటున్నారు. ఆయనకు భార్యా, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
గురువారం రాత్రి వారంతా సైనైడ్ తాగినట్లు తెలుస్తున్నది. దీంతో రామకృష్ణతోపాటు భార్య మాధవి (38), కుమార్తెలు వైష్ణవి (16), లక్ష్మి (13) మృతిచెందారు. మరో కుమార్తె కుసుమప్రియ (13) అనకాపల్లిలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే వారంతా బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు.