భోపాల్ : కారు – ట్రక్కు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అష్టమి సందర్భంగా పూజల కోసం హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా.. రహత్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్టమి పూజల కోసం కారులో కాన్పూర్కు వెళ్తుండగా.. కారు ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొన్నదని సుర్ఖి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆనంద్ రాజ్ తెలిపారు.
ఈ ప్రమాదంలో మోహిత్ శుక్లా (40), అతని భార్య దక్ష అలియాస్ శ్రద్ధా శుక్లా (35), దంపతుల కూతుళ్లు లావణ్య శుక్లా (11) మాన్య శుక్లా (6) ప్రాణాలు కోల్పోయారు. పంకజ్ శుక్లా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. ట్రక్కు కారును పక్క నుంచి ఢీకొట్టిందని, ఆ తర్వాత పది అడుగుల దూరం కారును లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ఉన్న వారంతా కేకలు వేయగా.. అక్కడే ఉన్న పలువురు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కారు దెబ్బతినడంతో అందులోనే దంపతులతో పాటు వారంతా అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కట్టర్ల సహాయంతో కారులో నుంచి వారిని బయటకు తీయగా.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు.