భోపాల్ : మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భగోరియా వేడుకల్లో ఇద్దరు గిరిజన మహిళలను పట్టపగలు అందరి ఎదుటే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేయగా మరోవైపు 15 మంది నిందితులకు గాను నలుగురుఇపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు నమోదు చేశారు. గిరిజన మహిళలను వేధించిన 15 మంది నిందితులను ధర్, అలిరాజ్పూర్ జిల్లాల నుంచి అరెస్ట్ చేశారు.
ఇక సొన్వా ప్రాంతంలోని వల్పూర్ గ్రామ శివార్లలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. వైరల్ వీడియోలో మహిళలు ఓ వాహనం పక్కన నిలుచునిఉండగా పలువురు వ్యక్తులు వారి చుట్టూ మూగి పట్టపగలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలను అక్కడున్న వారు తమ ఫోన్లలో రికార్డు చేసినా వారిని కాపాడేందుకు మాత్రం ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ వీడియోలో సరుకు రవాణా వాహనం వెనుక నిలుచున్న మహిళలను ముద్దుపెట్టుకునేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. మహిళలు తప్పించుకునేందుకు ప్రయత్నించినా వారిని వెంటాడిన దుండగులు అందరిముందే లైంగికంగా వేధించారు.
బాధిత మహిళలు ఫిర్యాదు చేయకపోయినా వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధిత మహిళలను ఫిర్యాదు చేయాలని కోరినా వారు స్పందించలేదని పోలీసులు తెలిపారు. ఎన్ఎస్ఏ అభియోగాలు నమోదైన ప్రధాన నిందితులను నరేంద్ర దవర్ (25), విశాల్ కియదియ (30), దిలీప్ (30), మున్నా భీల్ (30)ను ఉజ్జయిని జైలుకు తరలించామని అలిరాజ్పూర్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. మహిళల భద్రతకు సవాల్గా నిలిచే ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.