హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల అర్బన్: కరోనా మహ్మమారితో కుటుంబాలు ‘చితి’కి పోతున్నాయి. వైరస్ ఒకరి తర్వాత మరొకరని కాటికి పంపుతూ కుటుంబాలను ఛిద్రం చేస్తున్నది. జగిత్యాలలో కరోనా రెండ్రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరినీ బలితీసుకున్నది. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన అన్నదమ్ములు జంగిలి రాజన్న, జంగిలి రవీందర్కు పదిరోజుల క్రితం కరోనా సోకింది. కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి రవీందర్ మంగళవారం మృతి చెందాడు. గురువారం రాజన్న కూడా చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజూ రెండు, మూడైనా జరుగుతూ ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కరోనా మహమ్మారి భార్యాభర్తలు, తండ్రీ కొడుకులనూ కాటేస్తున్నది. కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్ వస్తే మిగిలినవారు సపర్యలు చేయాల్సి రావడంతో అందరికీ వైరస్ సోకుతున్నది. దీంతో కుటుంబంలో అందరూ కరోనా బారినపడుతూ ఒకరి తర్వాత ఒకరు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి పలు ఘటనలు రాష్ట్రంలో తరుచూ చోటుచేసుకున్నాయి.
అయినవారు దూరం
కుటుంబానికి అండగా ఉంటారకున్నవారు కమ్ముమూసి పుట్టెడుదుఖంలో ఉంటే, దహన సంస్కారాలకు అయినవారు రాకపోవడం బాధను రెట్టింపుచేస్తున్నది. కరోనాతో చనిపోయారని తెలిసి బంధువులెవరూ చివరి చూపునకు సైతం రావడం లేదు. కరోనా కష్టాలు కన్నీటినే మిగిలిస్తున్నాయంటూ బాధను చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రాకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే ఐసొలేషన్ కావాలని, ఇం ట్లో వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం మరచిపోవొద్దని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకొనే చిన్నచిన్న జాగ్రత్తలే మనతోపాటు, మన కుటుంబానికి శ్రీరామరక్ష అని పేర్కొంటున్నారు.