కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఇద్దరు మిలీషియా సభ్యులు, ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ దత్ గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయిందన్నారు.
ఇప్పటికే వారి సిద్ధాంతాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. జిల్లా సరిహద్దుల్లో చత్తీస్గఢ్ దండకాణ్యంలో కేంద్రంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు కొసాగిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలకు వారిపట్ల పూర్తి అపనమ్మకం ఏర్పడిందని, ఇక్కడి ప్రజలు వారికి ఎలాంటి సహకారాలు అందించడం లేదని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్న పొడియం రాజీ, సోడి గంగిలతో పాటు చర్ల మండలం కొండవాయి గ్రామ కమిటీ సభ్యులైన దూది గంగ, పొడియం అదమయ్య, ముస్కి కోసయ్యలు పోలీస్ శాఖ ఎదుట లొంగిపోయారని తెలిపారు.
వీరంతా మావోయిస్టులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక, ఇటీవల పోలీస్ శాఖ గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట నిర్వహిస్తున్న వివిధ సామాజిక అవగాహన కార్యక్రమాలతో సత్ప్రవర్తన కలిగి లొంగిపోయినట్లు పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతవారు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, బంధువులు, మిత్రుల ద్వారా కానీ వచ్చి లొంగిపోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి, భద్రాచలం ఏఎస్పీ అక్షాంష్ యాదవ్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్వీర్ యాదవ్, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్, ఎస్సైలు రాజువర్మ, వెంకటపయ్య, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్లు పాల్గొన్నారు.