శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సు లోయలోకి దూసుకువెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. బస్సు పూంచ్ నుంచి జమ్మూకు వెళ్తుండగా రాజౌరి జిల్లా భీంబర్ గలి సమీపంలో గురువారం జరిగింది. గత 24 గంటల్లో ఇది రెండో బస్సు ప్రమాదం. అయితే, బస్సు ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియరాలేదు.
ఘటనలో ఐదుగురు మృతి చెందడంపై కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారు జామున పూంచ్ జిల్లా సావ్జియాన్ నుంచి మండికి వెళుతున్న మినీ బస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 11 మంది దుర్మరణం చెందగా, 30 మంది గాయపడ్డారు.