జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్నగర్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు. శనివారం రాత్రి మెగా హైవేపై కారు, ఇటుకల లోడ్లో వెళ్తున్న వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన పలువురు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి గాయపడ్డ ఇద్దరిని ఆసుప్రతికి తరలించారు.
ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం బికనీర్కు రిఫర్ చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పల్లు నుంచి సర్దార్షహర్ వైపు ఇటుకలతో వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని, మృతులంతా పల్లు నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.