చెన్నై : తమిళనాడు కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై వెప్పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు ప్రైవేట్ బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రమాదంలో కారు దెబ్బతినడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఫైర్మెన్ బృందంతో సహాయంతో మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, కారు ఆర్సీ బుక్ ప్రకారం.. మృతులు చెన్నైలోని నంగనల్లూరుకు చెందిన వారిగా సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.