న్యూఢిల్లీ : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 నుంచి నిందితులు ఈ నిర్వాకానికి పాల్పడుతూ ఇప్పటివరకూ 400 తప్పుడు కొవిడ్-19 రిపోర్టులు ఇచ్చినట్టు వెల్లడైందని డీసీపీ (దక్షిణ ఢిల్లీ) అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఖిర్ఖి ఎక్స్టెన్షన్ కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంలోని 45 మందికి నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇచ్చారని ఫిర్యాదు చేశారని చెప్పారు. కొద్దిరోజుల విరామంలో ఒకే కుటుంబానికి చెందిన 45 మంది ఒకే చోట శాంపిల్స్ ఇచ్చారు.
వీరిలో ఒకరికి ఏమాత్రం వైరస్ లక్షణాలు లేకపోవడంతో వేరే ల్యాబ్ లో పరీక్ష చేయించుకోగా నెగెటివ్ గా ఫలితం వచ్చింది. దీంతో గతంలో తమకు రిపోర్ట్ ఇచ్చిన లెటర్ హెడ్ లో ఉన్న ల్యాబ్ లో నిలదీయగా అసలు తమ వివరాలతో కూడిన రికార్డు లేకపోవడంతో వారు విస్తుపోయారు. నిందితులతో తమకు సంబంధం లేదని సదరు ల్యాబ్ వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుతో నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తూ మోసగిస్తున్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు నేరంతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.