బేగంపేట్ : రాణిగంజ్లోని ఓ విద్యుత్ బల్బుల గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా అసిస్టెంట్ డీఎఫ్వో ధనుంజయ్ రెడ్డి కథనం ప్రకారం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఫైర్ అలారమ్ ద్వారా తమ గోదాములో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గ్రహించిన యజమాని అశ్విన్ వేద్ వెంటనే ఫైర్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు 7ఫైర్ ఇంజిన్లు ఉదయం 11 గంటల వరకు శక్తివంచన లేకుండా పని చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.