మన్సూరాబాద్ : జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎం దగ్ధమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వాటర్ ఏటీఎం దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, మన్సూరాబాద్ చౌరస్తాలోని అన్నపూర్ణ హోటల్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల క్రితం వాటర్ ఏటీఎంను ప్రారంభించారు.
మన్సూరాబాద్లోని వాటర్ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగడాన్ని అటువైపుగా వచ్చిన ఎల్బీనగర్ మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో పోలీసులు హయత్ నగర్ ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే వాటర్ ఏటీఎం దగ్ధమైంది.
వాటర్ ఏటీఎంతో పాటు పక్కనే ఉన్న చెప్పులు కుట్టే డబ్బా పూర్తిగా దగ్ధమయ్యింది. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు మరింతగా వ్యాప్తి చెందకుండా అరికట్టారు. ఈ ఘటనలో వాటర్ ఏటీఎం రూ. 5 లక్షలు, చెప్పుల డబ్బా రూ. 1 లక్ష మేర ఆస్తినష్టం జరిగింది. వాటర్ ఏటీఎం, చెప్పుల డబ్బా దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియరావల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.