చండీగఢ్: పొరుగింటి వ్యక్తితో రూ.50 కోసం జరిగిన గొడవ వల్ల ప్రతీకారంతో పసి బాలుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ దారుణం జరిగింది. సెక్టార్ 56లో నివాసం ఉండే 22 ఏండ్ల నరేశ్ నిరుద్యోగి. డ్రగ్స్కు కూడా బానిస అయ్యాడు. ఒక రోజు పొరుగింటికి చెందిన 8 ఏండ్ల బాలిక చేతిలోని రూ.50 లాక్కున్నాడు. దీంతో నరేశ్ను ఆ బాలిక తండ్రి నిలదీసి మందలించాడు. ఈ నేపథ్యంలో పొరుగింటి వ్యక్తిపై నరేశ్ కక్ష పెంచుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 5న పొరుగింటి వ్యక్తికి చెందిన ఏడాదిన్నర బాలుడు ఒంటరిగా ఉండటం చూసిన నరేశ్, ఆ పసి బాలుడ్ని తన ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అనంతరం వాటర్ ట్యాంకులో ఆ చిన్నారిని ముంచి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ట్యాంకు మూతను వైర్తో కట్టి మూసివేశాడు. ఆ తర్వాత నరేశ్ అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు బాలుడు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు అంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నరేశ్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ప్రశ్నించగా పసి బాలుడ్ని తానే హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. బాలుడి మొలతాడు, మెడలోని తాయెత్తును నరేశ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు.