భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. బావతో కలిసి గుజరాత్ పారిపోయిన మైనర్ బాలిక (15)ను రూ 1.5 లక్షలకు 35 ఏండ్ల వ్యక్తికి కుటుంబ సభ్యులు అమ్మిన ఘటన ధర్ జిల్లా ధర్మపురి పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామంలో వెలుగుచూసింది. తన భర్తతో కలిసి తన చెల్లెలు వెళ్లిపోయిందని, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని యువతి గ్రామపెద్దలకు తెలపగా జిల్లాలోని మన్నవర్ తహసిల్కు చెందిన 35 ఏండ్ల వ్యక్తికి మైనర్ బాలికను అమ్మాలని పంచాయితీ ఆదేశించిందని తమకు సమాచారం అందిందని జిల్లా చైల్డ్లైన్ సభ్యుడు పంకజ్జైన్ తెలిపారు.ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని స్ధానిక పోలీసులు నిర్ధారించారు.
గ్రామపెద్దల ఆదేశం ప్రకారం మన్నవర్కు చెందిన వ్యక్తికి బాలికను రూ 1.55 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదిరిందని, కుల పంచాయితీ పెద్దకు రూ 5000 అడ్వాన్స్ చెల్లించారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బాలిక తల్లితండ్రులకూ కొంత మొత్తం ముట్టచెప్పారని ఈ వ్యవహారంపై దర్యాప్తు సాగుతోందని పోలీసులు తెలిపారు.మరోవైపు బాలికను కాపాడి జిల్లా చైల్డ్లైన్ అధికారులకు అప్పగించామని, వారు కౌన్సెలింగ్ చేపడుతున్నారని జిల్లా ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ వెల్లడించారు. బాలిక చదువుకోవలని కోరుకుంటోందని, అదే సమయంలో తన బావ వద్ద ఉండాలని చెబుతోందని జిల్లా చైల్డ్ లైన్ సభ్యులు చెబుతున్నారు.