షాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన పామెన మాణిక్యరావు(35)కు గత 12 ఏండ్ల క్రితం షాబాద్కు చెందిన శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కొద్దిరోజులుగా షాబాద్కు చెందిన యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వీళ్ల అక్రమ సంబంధానికి ఆమె భర్త మాణిక్యరావు అడ్డుగా ఉన్నాడని ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న తనకు ఆరోగ్యం బాగాలేదని శోభారాణి తన భర్తతో కలిసి షాద్నగర్ దవాఖానకు వెళ్లింది.
దవాఖానకు చూపించుకుని అక్కడి నుంచి ఆటోలో మామిడిపల్లికి వచ్చారు. ఆటో దిగి ఇద్దరు రోడ్డు మార్గముగా నడుచుకుంటూ షాబాద్కు వస్తున్నారు. అప్పటికే తన ప్రియుడు యాదయ్యకు శోభారాణి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. వాళ్ల ప్లాన్ ప్రకారమే యాదయ్య మామిడిపల్లి శివారుకు బైకు పైన వెళ్లాడు. ఇద్దరు కలిసి చున్ని తీసుకుని మాణిక్యరావు మెడకు కట్టి గట్టిగా బిగించి హత్య చేశారు. అప్పటికే సాయంత్రం 7గంటల కావడంతో శవాన్ని పొదల్లో వేశారు. మరుసటి రోజు యాదయ్య స్నేహితులైన వినోద్, శ్రీశైలం సహాయంతో ఒక కారు తీసుకుని వెళ్లి శవాన్ని కారు డిక్కీలో వేసుకుని శ్రీశైలం హైవేలో గల అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోయలో పడేసి తిరిగి వచ్చారు.
తర్వాత ఇంటికి వచ్చిన శోభారాణి ఏమి తెలియనట్లుగా మీ కొడుకు కనిపించడం లేదని అతడి తండ్రి అనంతయ్యకు చెప్పడంతో ఈ నెల 24న మృతుడి తండ్రి అనంతయ్య షాబాద్ పొలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో భార్య కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆదివారం నిందితురాలు శోభారాణితో పాటు ఆమె ప్రియుడు యాదయ్య, మరో ఇద్దరు వినోద్, శ్రీశైలంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించిన్నట్లు సీఐ తెలిపారు.