రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఐరన్ ఓర్ దగ్గరలో సర్పంచ్తో పాటు మాజీ సర్పంచ్పై దాడి చేశారు. రాళ్లతో కొట్టి ఆ తర్వాత కాల్పులు జరిపారు. మావోయిస్టుల దాడిలో మాజీ సర్పంచ్ నోహర్ ప్రాణాలు కోల్పోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గ్కోడల్ ప్రాంతంలోని ఓ కంపెనీకి చెందిన ఐరన్ ఓర్ దగ్గర ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని కాంకేర్ ఎస్పీ శలభ్ సిన్హా తెలిపారు. మృతుడు నోహర్ ఖుత్గావ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అని పేర్కొన్నారు. ఐరన్ ఓర్ వద్ద రవాణా పనుల్లో నిమగ్నమవగా.. అక్కడికి వచ్చిన ముగ్గురు కంట్రీ మేడ్ పిస్టల్తో కాల్పులు జరిపి, అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు గాయపడగా.. కాంకేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మాజీ సర్పంచ్ ప్రాణాలు కోల్పోయాడరని వివరించారు. అయితే, సంఘటనా స్థలంలో మావోలకు సంబంధించిన కరపత్రాలు ఏమీ లభ్యం కాలేదని, ఇది మావోల పనేనని, ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు.