ముంబై: రోడ్డుపై ఒక బైక్ చాలా నెమ్మదిగా వెళ్తుండటంతో అటుగా వెళ్తున్న ఒద్దరు కానిస్టేబుళ్లకు అనుమానం వచ్చింది. ఆ బండిని ఫాలో అయ్యారు. ఒకచోట యూటర్న్ తీసుకున్న ఆ బైక్.. మెడలో చైన్ వేసుకొని వెళ్తున్న ఒక యువతి దగ్గరగా వెళ్లింది. బండిపై ఉన్న వ్యక్తి ఆమె చైన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో వెనకే ఉన్న పోలీసులు వేగంగా వచ్చి తమ బండితో ఆ బైక్ను ఢీకొట్టారు. ముగ్గురూ కింద పడటంతో వారికి చిన్న గాయాలయ్యాయి.
కానీ దొంగ మాత్రం దొరికిపోయాడు. ఇదే ఏదో సినిమాలో సీన్లా ఉందే అనుకుంటే.. ఈ కథ అప్పుడే పూర్తవలేదు. సదరు దొంగను ఉమేష్ పాటిల్ (27)గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అతను సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒక కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగానికి చేరాడు. అక్కడ వచ్చే జీతం అతనికి చాల్లేదట.
జీతం విషయంలో అసంతృప్తికి గురైన అతను చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. ప్రారంభంలో తుష్కర్ ధిక్లే అనే వ్యక్తితో కలిసి ఈ దొంగతనాలు చేశాడు. అలా ఒక 20 చైన్ స్నాచింగ్లు చేసిన తర్వాత గతేడాది నవంబరులో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కూడా పాటిల్ మాత్రం తన పని మానలేదు. సుమారు 36 మంది చైన్లు ఇలా లాక్కెళ్లాడు.
వీటిని అమ్మిన డబ్బుతో ఒక ఫ్లాట్, కారు కొన్నాడు. అతని బైక్ను ఢీకొట్టిన పోలీసులకు పాటిల్ రెండు జాకెట్స్ వేసుకున్నట్లు కనిపించింది. అవి తీస్తే అతని వద్ద ఒక బ్యాగ్ దొరికింది. దానిలో ఒక నంబర్ ప్లేటు, స్క్రూ డ్రైవర్ ఉన్నాయి. దొంగతనం చేసిన తర్వాత కొంత దూరం వెళ్లి బండి నెంబర్ ప్లేట్ మార్చేయడం పాటిల్ పథకం.
ఇలా చేయడం ద్వారానే చాలా కేసుల నుంచి తప్పించుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు రూ.2.5 లక్షల డబ్బు, 27 బంగారు చైన్లు దొరికాయి. బంగారం ధర పెరిగిన తర్వాత వాటిని అమ్ముదామనే ఆలోచనతో ఈ చైన్లను దాచుకున్నాడా నిందితుడు. పాటిల్తోపాటు తుష్కర్, వీరికి సాయం చేసిన నలుగురు బంగారు దుకాణదారులను కూడా అరెస్టు చేశారు.