మంచి అల్లుడు దొరికాడనే ఆనందంతో భారీగా ఖర్చుచేసి రూ.6 కోట్లతో తమ కుమార్తె వివాహం చేశారా దంపతులు. నాలుగు కేజీల బంగారం, కూపర్ కారు, రెండు వస్త్ర దుకాణాలు కట్నంగా ఇచ్చారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. సదరు భర్త డ్రగ్స్కు బానిస. అప్పటి వరకు తాము అపురూపంగా పెంచుకున్న బిడ్డను ఒక నీచుడితో పంపుతున్నట్లు ఆ దంపతులకు తెలియదు.
డ్రగ్స్ మత్తులో ఆ అమ్మాయిని వేధించేవాడా భర్త. ఇటీవల ఆ మత్తులో ఆమెను కొట్టి, తలపై మూత్రం పోశాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. తెలంగాణకు చెందిన ఒక ప్రముఖ వస్త్ర దుకాణాల అధిపతి కుమార్తెకు ఈ గతి పట్టింది. గత జనవరిలో ఆమెను సందీప్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.
రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా చేసిన ఈ పెళ్లి తంతుకు రూ.6 కోట్లు ఖర్చయింది. ఇదంతా అమ్మాయి తరఫువాళ్లే పెట్టుకున్నారు. అల్లుడికి కట్నం కింద 4 కేజీల బంగారం, కూపర్ కారు, రెండు వస్త్ర దుకాణాలు ఇచ్చారు. కానీ ఇవేమీ వాళ్ల కూతురి జీవితం నరకం కాకుండా అడ్డుకోలేకపోయాయి. డ్రగ్స్కు బానిసైన సందీప్.. దాదాపు ప్రతిరోజూ తన స్నేహితులను ఇంటికి పిలిచి మత్తు పార్టీలు చేసుకునేవాడు.
ఆమె వారిస్తే అందరి ముందూ చెయ్యి చేసుకునేవాడు. ఇటీవల ఈ హింస మరీ హద్దు మీరిందని, చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడంటూ సదరు యువతి బసవనతగూడి మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. భర్త డ్రగ్స్ తీసుకొని ఇంటికొచ్చి తనపై పాశవికంగా దాడి చేశాడని, ఆ తర్వాత తన తలపై మూత్రం పోశాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.