లక్నో: ఒక భక్తుడు తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆలయంలో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కౌశాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్, భార్య బన్నో దేవితో కలిసి శనివారం ఆ జిల్లాలోని మా షీట్ల ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి గంగానదిలో పవిత్ర స్నానం చేశాడు. ఆపై ఆలయంలో పొర్లుదండాల ప్రదక్షిణలు చేశాడు. అనంతరం వెంట తెచ్చిన బ్లేడ్తో నాలుక కోసుకున్నాడు. ఆలయం ప్రధాన ద్వారం వద్ద తెగిన నాలుకను ఉంచి దేవతకు సమర్పించాడు.
కాగా, తీవ్రంగా రక్తం కారడంతో భక్తుడు సంపత్ను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే సంపత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆలయాన్ని సందర్శించాలని శుక్రవారం రాత్రే భర్త తనతో అన్నాడని భార్య బన్నో దేవి తెలిపింది. దీంతో శనివారం ఆలయాన్ని సందర్శించామని, అయితే ఇలా నాలుక కోసుకోవడాన్ని తాను ఊహించలేదని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.