న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారింది. దుండగులు ఒక మహిళపై కాల్పులు జరిపి హత్య చేశారు. అమన్ విహార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి వేళ ఒక వ్యక్తి ఒక ఇంటి ముందు ఉన్నాడు. మరో వ్యక్తి రోడ్డు వద్ద కాపాలాగా ఉన్నాడు. కాగా, డోర్ తీసిన పెద్ద వయసు మహిళపై గేట్ వద్ద ఉన్న వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రోడ్డు వద్ద కాపాలా ఉన్న వ్యక్తితోపాటు మరో వ్యక్తిని అతడు కలుసుకున్నాడు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు. గన్ కాల్పుల్లో చనిపోయిన మహిళ 55 ఏళ్ల గీత అని తెలిపారు. ఏడాది కిందట ఆమె కుమారుడు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. దీనిని సహించని యువతి కుటుంబం ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా హంతకులను గుర్తించి అరెస్ట్ చేశారు.