న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు పోలీస్ అవతారమెత్తి కరోనా జరిమానా పేరుతో ఆస్ట్రేలియా మహిళను దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఇద్దరు వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకుని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో తిరిగారు. ఆస్ట్రేలియా జాతీయురాలైన 73 ఏండ్ల వృద్ధురాలి వద్దకు వచ్చారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు వేలు ఫైన్ కట్టాలని డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించగా బలవంతంగా రెండు వేలు లాక్కొని పారిపోసాగారు. దీంతో ఆ మహిళ కేకలు వేసింది.
ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు దీనిని గమనించారు. పారిపోతున్న ఇద్దరు వ్యక్తుల వెంటపడి వారిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన 30 ఏండ్ల బద్రీనాథ్, 28 ఏండ్ల వకీల్గా గుర్తించారు. డ్రగ్స్, మద్యానికి బానిసైన ఆ ఇద్దరూ త్వరగా డబ్బులు సంపాదించేందుకు చోరీ బాటపట్టినట్లు దర్యాప్తులో పోలీసులకు వెల్లడించారు.