న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కీలక ఔషధాలను నిల్వ చేసి బ్లాక్ దందాతో జేబులు నింపుకుంటున్న దళారుల రాకెట్ ను ఢిల్లీ పోలీసులు చేధించారు. రెమ్డిసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ చేసిన రెండు వేర్వేరు ముఠాలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 81 ఇంజక్షన్ వయల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రమేయమున్న మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ లో గాలింపు చర్యలు చేపట్టామని సైబర్ వింగ్ డీసీపీ మోనిక భరద్వాజ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్డిసివిర్ ఇతర మందుల కొరతను గుర్తించిన నిందితులు వీటిని నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్ లో అత్యధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఇంజెక్షన్లను డిమాండ్ పై అధిక ధరలకు సరఫరా చేసేలా వీరు ఓ వ్యవస్ధను ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. రెమ్డిసివిర్ ఇంజక్షన్లను వయల్ కు రూ 25,000 నుంచి రూ 40,000 వరకూ విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని చెప్పారు. ఈ ముఠా వెనుక కీలక నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.