న్యూఢిల్లీ : మద్యానికి బానిసయ్యాడని స్వయానా సోదరుడిని కత్తితో పొడిచి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో వెలుగుచూసింది. మద్యం అలవాటుపై ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో నిందితుడు తన సోదరుడి ఛాతీలో కత్తితో పొడిచాడు. సోదరుడిని మద్యం అలవాటు మానుకోవాలని నిందితుడు సుజిత్ హితవు పలికాడు.
ఇదే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఆగ్రహానికి లోనైన సుజిత్ కత్తితో సోదరుడు మంజిత్ ఛాతీలో పొడిచాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడు రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
మంజీత్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా అతడి ఛాతీ కుడిభాగంలో కత్తి గాయాలున్నాయని వెల్లడైంది. పోలీసుల దర్యాప్తులో సోదరుడిని తానే హత్య చేశానని నిందితుడు సుజిత్ నేరాన్ని అంగీకరించాడు. మద్యం అలవాటుకు సోదరుడు బానిసగా మారడంతో అతడిపై తాను పట్టరాని ఆవేశంతో కత్తితో దాడి చేశానని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.