హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి ఏడేండ్లయినా ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల విభజన ఎందుకు చేయలేదని రెండు రాష్ర్టాల బోర్డులను హైకోర్టు ప్రశ్నించింది. బోర్డుల ఉన్నతాధికారులు కూర్చుని ఆమోదయోగ్యంగా ఉండేలా ఉద్యోగుల విభజన చేయాలని సూచించింది. ప్రక్రియ రెండు నెలల్లో పూర్తిచేసి, విధి విధానాలు రూపొందించాలని పేర్కొంటూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. ఇంటర్బోర్డు ఉద్యోగుల విభజన చేయకపోవడాన్ని తప్పుపడుతూ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న బోర్డు ఉద్యోగుల సీనియారిటీ లిస్టును ఏపీ బోర్డు రూపొందించాలని, ఆ తర్వాత రెండు రాష్ర్టాల బోర్డుల అధికారులు కూర్చుని విభజనకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంటర్ బోర్డు ఏర్పాటుచేస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం.. అదే ఏడాది 24 మంది ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఉద్యోగులు కొంతమంది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో ఉండిపోయారు. పూర్తిస్థాయిలో బోర్డు విభజన చేయకుండానే సూపరింటెండెంట్ పోస్టుల కోసం పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలో జూనియర్లకు అవకాశం కల్పించారని పిటిషనర్లు ఆరోపించారు. తెలంగాణకు చెందినవారి దరఖాస్తులను పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు.