న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా నటించిన పోలీసులు 25 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తుగ్లకాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న కిషన్ లాల్, 1997 ఫిబ్రవరిలో హత్యకు గురయ్యాడు. నాడు గర్భంతో ఉన్న భార్య సునీత ఒంటరి అయ్యింది. అదే ప్రాంతంలో నివసించే రోజువారీ కూలీ రాము అనుమానిత హంతకుడిగా పాటియాలా హౌస్ కోర్టు ప్రకటించింది. అయితే అతడి గురించి తెలియకపోవడంతో 25 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్లో ఉంది.
కాగా, పాత కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఢిల్లీ ఉత్తర జిల్లా పోలీస్ బృందం 2021 ఆగస్ట్లో ఈ కేసు ఫైల్ దుమ్ము దులిపింది. ఆ పోలీస్ బృందం ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లో అండర్కవర్ ఆపరేషన్ చేపట్టింది. హంతకుడు రాము ఎక్కడ ఉన్నాడో అన్నది కనిపెట్టేందుకు పోలీసులు ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా నటించారు. చివరకు రాము బంధువును ట్రేస్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ జిల్లాలోని రాము కుటుంబ సభ్యులను కలిశారు.
ఈ సందర్భంగా రాము కుమారుడు ఆకాష్ మొబైల్ నంబర్ వారికి లభించింది. దీంతో ఫేస్బుక్ ఖాతా ద్వారా లక్నోలోని కపుర్తలా ప్రాంతంలో ఉన్న ఆకాష్ను పోలీసులు కలిశారు. అతడి తండ్రి గురించి అడిగారు. అయితే తండ్రిని తాను కలవలేదని, లక్నోలోని జానకీపురం ప్రాంతంలో ఎలక్ట్రిక్ ఆటో నడుపుతున్నాడని చెప్పాడు.
మరోవైపు హంతకుడు రాము ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ఈసారి ఎలక్ట్రిక్ ఆటో ఏజెంట్లుగా అవతారమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద రాయితీ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు చేస్తామంటూ జానకీపురం ప్రాంతంలోని పలువురు ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. చివరకు ఈ నెల 14న ఒక ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్ ద్వారా రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న 50 ఏళ్ల రామును అదుపులోకి తీసుకున్నారు.
అయితే తన పేరు రాము కాదు అశోక్ యాదవ్ అని, ఢిల్లీలో ఎప్పుడూ నివసించలేదని అతడు బుకాయించాడు. దీంతో పోలీసులు కిషన్ లాల్ భార్య సునీతను లక్నోకు రప్పించారు. 24 ఏళ్ల కుమారుడితో కలిసి వచ్చిన ఆమె రామును గుర్తుపట్టింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతడ్ని ప్రశ్నించగా చివరకు నిజాన్ని బయటపెట్టాడు.
1997 ఫిబ్రవరి 4న చీటీ డబ్బులు అందుకున్న కిషన్ లాల్కు మందు పార్టీ ఇచ్చినట్లు రాము తెలిపాడు. మత్తులో ఉన్న అతడ్ని కత్తితో పొడిచి హత్య చేసి అతడి వద్ద ఉన్న డబ్బుతో పారిపోయినట్లు చెప్పాడు. అనంతరం పలు చోట్ల దాక్కున్న తాను చివరకు లక్నోలో స్థిరపడినట్లు వెల్లడించాడు. అలాగే అశోక్ యాదవ్గా పేరు మార్చుకుని ఆ పేరుతో నకిలీ ఆధార్ కార్డు కూడా పొందినట్లు తెలిపాడు. దీంతో 25 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించి హంతకుడు రామును అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.