న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మసాజ్, స్పా సెంటర్ల ముసుగులో సెక్స్ రాకెట్లు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఇటీవల తమ హెల్ప్లైన్కు వచ్చిన కాల్ ఆధారంగా సోమవారం ఓ సెక్స్ రాకెట్ను భగ్నం చేసింది. ఆజాద్పూర్ ప్రాంతంలో మసాజ్ పార్లర్ లోపల సెక్స్ రాకెట్ సాగుతోందని, 27 ఏండ్ల మహిళపై లైంగిక దాడి యత్నం జరిగిందని డీసీడబ్ల్యూకు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. డీసీడబ్ల్యూ బృందం తక్షణమే ఘటనా స్ధలానికి వెళ్లి మహిళను కాపాడింది.
జాబ్ కోసం మహిళ మసాజ్ పార్లర్కు వెళ్లగా అక్కడ ఆమెకు నిందితుడు బలవంతంగా మద్యం తాగించి ఆపై రూంలో లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక పంపాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ డిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. స్పాలు, మసాజ్ పార్లర్లలో జరుగుతున్న సెక్స్ రాకెట్లపై తాము ఎప్పటినుంచో పోలీసులకు నివేదిస్తున్నామని, ఢిల్లీలోని పలు స్పాలు, మసాజ్ సెంటర్లలో వ్యభిచార రాకెట్లను తాము రట్టు చేశామని ఆమె వెల్లడించారు.
ఢిల్లీలోని వేలాది స్పాల్లో చీకటి దందా కొనసాగుతూనే ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దందా వెనక ప్రధాన సూత్రధారులను, వారితో కుమ్మక్కైన అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్స్ రాకెట్ సాగుతున్న ప్రాంతాలను సీల్ చేయడంపై పోలీసులు, కార్పొరేషన్ అధికారులు చేపట్టిన చర్యలపై డీసీడబ్ల్యూ ఆరా తీస్తోంది.