చెన్నై: ప్రేమ జంట పరువు హత్య కేసులో ఒక నిందితుడికి మరణ శిక్ష, ఇద్దరు పోలీస్ అధికారులతో సహా 12 మందికి జీవిత కాల జైలు శిక్షను తమిళనాడు కోర్టు విధించింది. 18 ఏండ్ల కిందట జరిగిన ఈ కేసులో ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. కడలూరు జిల్లా కుప్పనాథం గ్రామంలో ఉన్నత కుటుంబానికి చెందిన 22 ఏండ్ల డీ కన్నగి, దళిత కుటుంబానికి చెందిన 25 ఏండ్ల ఎస్ మురుగేశన్ ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి మహిళ కుటుంబం ఒప్పుకోకపోవడంతో వారిద్దరూ 2003 మేలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెద్దలకు భయపడి కొంతకాలం విడివిడిగా నివసించారు. అయినప్పటికీ వారి పెండ్లిని కన్నగి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
దీంతో కలిసి ఉంటున్న ఈ జంటను మహిళ కుటుంబ సభ్యులు కుట్రపన్ని ఇంటికి ఆహ్వానించారు. నాటి గ్రామ సర్పంచ్గా ఉన్న కన్నగి తండ్రి దురైస్వామి గ్రామస్తుల సమక్షంలో ఆ జంటను దారుణంగా కొట్టించి వేధించారు. అనంతరం వారి ముక్కు, చెవుల్లో విషం పోసి హత్య చేశారు. ఇద్దరి మృతదేహాలను తగులబెట్టారు.
ప్రేమ జంట పరువు హత్యపై మురుగేశన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో దళితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో సంచలనం రేపిన ఈ జంట పరువు హత్యపై 2004లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 15 మందికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయడంతోపాటు 81 మంది సాక్షులను ప్రశ్నించింది. అయితే వీరిలో సగం మంది సాక్షులు ఎదురుతిరిగారు.
మురుగేశన్ కుటుంబం సుమారు 18 ఏండ్లపాటు న్యాయపోరాటం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కడలూరు జిల్లా ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మహిళ సోదరుడు మరుధుపాండియన్కు మరణ శిక్ష విధించింది. మహిళ తండ్రి దురైస్వామి, కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన నాటి చెల్లముత్తు సీఐ (ప్రస్తుతం రిటైర్డ్), తమిళ్మారన్ ఎస్ఐ (ఇప్పుడు ఇన్స్పెక్టర్)తో సహా 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.