Cyber Fraud | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. ఇందులో ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు ఉండడం గమనార్హం. తాజాగా ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ప్రభుత్వ అధికారుల పేరు చెప్పిన కేటుగాళ్లు ఏకంగా రూ.4.80కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబయిలో చోటు చేసుకున్నది.
మల్టినేషనల్ కంపెనీకి చెందిన మాజీ ఎండీ సాహేబ్ను నేరగాళ్లు ఫోన్ చేసి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుంటారంటూ బెదిరింపులకు గురి చేసి రూ.4.80కోట్లు లూటీ చేశారు. ఈ ఘటనలో థానే క్రైమ్ బ్రాంచ్లో కేసు నమోదైంది. అయితే, సదరు వ్యక్తులు కస్టమ్స్ అధికారులుగా చెప్పుకుంటూ కంపెనీ మాజీ ఎండీకి ఫోన్ చేశారు. తైవాన్ మార్గంలో ఓ ప్రధాన కొరియర్ కంపెనీకి చెందిన కస్టమ్స్ కార్యాలయంలో ఎండీఎంఏ డ్రగ్స్తో పాటు గడువు తీరిన పాస్పోర్టులు, క్రిడిట్కార్డులతో సహా పలు నిషేధిత వస్తువులున్న పార్శిల్స్ను అడ్డగించినట్లు సదరు ఫోన్ చేశారు.
వ్యవహారం నుంచి బయటపడేందుకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్నంబర్ సమాచారం చెప్పాలని లేకపోతే.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దాంతో పాటు అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత వీడియో కాలింగ్ యాప్ డౌన్లోడ్ చేయించి డెబిట్కార్డు సమాచారాన్ని అడిగారు. ఆ తర్వాత ఎండీ ఖాతా నుంచి ఆయన భార్య పేరు మీదకు రూ.కోటి బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఖాతా నుంచి రూ.4.80కోట్లు విత్డ్రా అయ్యాయని గుర్తించారు.
ఆ తర్వాత ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, బ్యాంకుల వివరాలు ఎవరికీ చెప్పొద్దని.. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు. మోసాలపై 155260 నెంబర్కి లేదంటే.. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.