బషీరాబాద్ : పొలానికి పురుగుల మందు పిచికారి చేస్తూ ప్రమాదవశాత్తు శరీరంపై పడి అస్వస్థకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం బషీరాబాద్ ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన ఖాజమియా(18) అక్టోబర్ నెల 13న మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన బల్వంత్రెడ్డి పత్తి పొలానికి పురుగుల మందు పిచికారి చేసేందుకు వెళ్లాడు. పొలానికి మందు పిచికారి చేస్తుండగా ప్రమాదవశాత్తు శరీరంపై పడింది. దీంతో అక్టోబర్ 20న ఖాజమియా అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా దవఖానకు తరలించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ దవఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 29వ తేదీన మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి షేక్ బాబర్ మియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.