పెద్దేముల్ : ఇంటి దగ్గర పార్కు చేసి ఉన్న ఓ ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నిప్పుపెట్టిన సంఘటన పెద్దేముల్ పోలీసుస్టేషన్ పరిధిలోని మంబాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంబాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రవి అనే వ్యక్తి ప్రతిరోజు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా శనివారం మధ్యాహ్నం కుమ్మరి రవి యాదగిరిగుట్టకు వెళ్లాల్సి ఉండగా అతను తన ఆటోను మంబాపూర్ గ్రామానికి చెందిన చించోలి రమేశ్ అనే వ్యక్తికి శనివారం అప్పజెప్పి వెళ్లిపోయాడు. కాగా రమేశ్ శనివారం, ఆదివారం రెండు రోజులు ఆటోను నడిపి తన ఇంటి దగ్గర ఆరుబయట వాకిట్లో ఆటోను నిలబెట్టి నిద్రపోయాడు.
ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆటోకు నిప్పుపెట్టారు. మంటల్లో కాలుతున్న ఆటోను గమనించిన రమేశ్ కుటుంబ సభ్యులు దాటిన నిద్రలేచి మంటలను చల్లార్చేలోపు ఆటో ముందుభాగం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న కుమ్మరి రవి ఆటో మంటల్లో కాలిపోవడంతో బాధితుడు బోరు విలపిస్తూ కన్నీరు మున్నీరయ్యాడు. సోమవారం ఉదయం బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగరాజు తెలిపారు.