షాబాద్ : ఆస్తి కోసం సొంత అక్కను చెల్లెలు చంపేందుకు కిరాయి హంతకులను పంపించి విఫలమైన సంఘటన షాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్కుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్యాయత్నానికి గల వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన తాటికొండ పుష్పమణి, సింధూరలు అక్కాచెల్లెల్లు. వీరికి విజయవాడలో 20గుంటల భూమి ఉంది. ఈ భూమి పంపకం లావాదేవీల్లో అక్కాచెల్లెళ్లకు వివాదాలు ఏర్పడ్డాయి. భూతగాదాల కారణంగా అక్కపై కోపం పెంచుకున్న చెల్లెలు సింధూర, తన భర్త శ్రీనాథ్తో కలిసి అక్కను చంపేందుకు పథకం పన్నారు. హైదరాబాద్లోని బండి శ్రీకాంత్గౌడ్ను కలిసి తన అక్క పుష్పమణిని చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు శ్రీకాంత్గౌడ్కు రూ. 2లక్షల నగదు, సుఫారీ, కారు ఇచ్చారు.
అయితే శ్రీకాంత్గౌడ్ హైదరాబాద్కు చెందిన భానుకిరణ్, సాయికిరణ్, వినోద్కుమార్, బ్రహ్మచారి, సాయికుమార్లను పిలిపించుకున్నాడు. పుష్పమణి హైదరాబాద్లోని మాదాపూర్లో నివాసం ఉంటూ, వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మిట్టకంకల్ వద్ద వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, అక్కడ ఫాంహౌస్ నిర్మిస్తుంది. ఫాంహౌస్ నిర్మాణంలో భాగంగా తరచు అక్కడకు వస్తూ ఉండేది. ఇదే అవకాశంగా భావించిన వీరు ఈ నెల 24వ తేదిన ఐదుమంది కారులో ఫౌంహౌస్ సమీపంలోని రేగడిదోస్వాడ వద్ద వేచి ఉన్నారు. సాయంత్రం 4గంటల సమయంలో స్నేహితుడు రాజేశ్కుమార్తో కలిసి పుష్పమణి తన కారులో ఫాంహౌస్ నుంచి తిరిగి నగరానికి వెళ్తున్నారు. అదే సమయంలో నిందితులు వారిపై దాడికి ప్రయత్నించారు.
కారు డోర్లు లాక్ చేయడంతో నిందితులు ఎంత ప్రయత్నించిన డోర్ తెరుచుకోకపోవడంతో కారు అద్దాలను పగులగొట్టి, చంపేందుకు ప్రయత్నిస్తుండగా కారును రివర్స్ తీసుకుని షాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు, గురువారం నాగరగూడ వద్ద వాహనాల తనీఖీలో అనుమానస్పదంగా వెళ్తున్న కారును ఆపి విచారించగా వారు పుష్పమణిని చంపేందుకు వెళ్తున్న నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 8మంది నిందితులకు గాను 5మందిని అరెస్టు చేయగా, మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 1.94లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, బీరు సీసాలు, వర్ణకారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.