పూణే: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిని హతమార్చాడో తనయుడు. ఈ ఘోరం మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. సచిన్ కుల్తే (31) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్యాపిల్లలు అతన్ని వదిలేసి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సచిన్ తన తల్లి విమల్ దత్తోపంత్ కుల్త (60)తో కలిసి ఉంటున్నాడు.
కొన్నేళ్ల క్రితం అతని తండ్రి కన్నుమూశాడు. ఆయన మరణం తర్వాత కొంత పొలం, డబ్బు విమల్కు దక్కాయి. ఆ డబ్బును తాగుడు కోసం తగలేసిన సచిన్ ఇంకా డబ్బు కావాలంటూ తల్లిని హింసించేవాడు. ఈ నేపథ్యంలో మద్యం కోసం డబ్బులడిగిన అతనికి తల్లి డబ్బులివ్వలేదు. తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని తేల్చిచెప్పేసింది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న అతను తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఆపై వంటగదిలో నుంచి కత్తి తీసుకొచ్చి పొడిచాడు. ఇంకా కోపం చల్లారకపోవడంతో కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఇన్ని దెబ్బలు తిన్న ఆ వృద్ధురాలు కన్నుమూసింది. అక్కడి నుంచి తన సోదరి ఇంటికి వెళ్లిన సచిన్.. తల్లి మరణవార్తను ఆమెకు వెల్లడించాడు. ఇంటికి వచ్చే సమయంలో తల్లి మరణవార్తను ఎవరికీ చెప్పొద్దని ఆమెతో పదేపదే చెప్పాడు.
అయితే ఇంటికొచ్చిన తర్వాత తల్లి దుస్థితి చూసిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది. అంతే సచిన్ ఇంట్లో నుంచి పరారైపోయాడు. ఆదివారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.