తాండూరు రూరల్ : ఓ మిస్సింగ్ కేసును ఛేదించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ జలంధర్రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాలాల మండలం, రాస్నం గ్రామానికి చెందిన శశికళ అలియాస్ అనంతమ్మ తన భర్త జములప్ప (35) ఈ నెల 18న తప్పిపోయినట్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాస్నం గ్రామానికి చెందిన జములప్పకు సంగాయిపల్లి గ్రామానికి చెందిన కోడి యాదమ్మతో గత 6 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ రాత్రి 10గంటల సమయంలో యాదమ్మకు జములప్ప ఫోన్ చేశాడు. ఆమె తన ఊరికి రావాలని కోరగా జములప్ప తన బైక్ (టీఎస్34ఎ8047) పై యాదమ్మ దగ్గరకు వెళ్తుండగా మార్గ మధ్యలో బైక్ హరిజన్ వీరప్ప పొలం వద్ద పార్కు చేసి యాదమ్మతో ఫోన్లో మాట్లాడుకుంటూ పొలంలోకి వెళ్లాడు. వీరప్ప పొలానికి అడవి పందులు రాకుండా కరెంట్ వైర్ పొలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కరెంట్ తీగను గమనించకుడా జములప్ప ఫోన్లో మాట్లాడుకుంటూ కరెంట్ వైర్కు తాకాడు. దీంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. యాదమ్మ ఫోన్ కాల్లోనే ఉంది. అవతలి వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి జములప్ప ఎప్పుడూ వచ్చే దారిలో వెతుకుతూ యాదమ్మ పొలం వద్దకు చేరుకుంది. అప్పటికే విద్యుత్షాక్కు గురై జములప్ప మృతి చెందాడు.
ఈ విషయాన్ని యాదమ్మ పొలం యజమాని హరిజన్ వీరప్పకు సమాచారం ఇచ్చింది. తన పొలం వద్ద కరెంట్ షాక్తో చనిపోయాడని, ఈ కేసు తనపై వస్తుందని భావించి శవాన్ని ఎక్కడైనా పాడేయాలని అనుకుని తన కొడుకును ఆనంద్ను పిలిచాడు. శవాన్ని బైక్ పై తీసుకెళ్లి సంగాయిపల్లిలోని వాగులో శవాన్ని పడేశారు. ఫోన్కాల్ ఆధారంగా యాదమ్మను విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. దీంతో మిగతా ఇద్దరి నిందితులను విచారించగా, తామే ఈ నేరాన్ని చేశామని అంగీకరించారని వివరించారు. ముగ్గురిని రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు.