మద్యం అలవాటు బాగా ఉన్న ఒక వ్యక్తి.. లిక్కర్ కొనుక్కురావాలని చెప్పి తల్లిని రాత్రిపూట బయటకు పంపించాడు. ఆమె తనకు మద్యం తీసుకురాకపోవడంతో అతనికి కోపం వచ్చి తల్లిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆ తల్లి సుత్తితో అతన్ని కొట్టి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసింది.
చెంబూర్ ప్రాంతంలో లూర్థమేరీ ముర్గేశన్ అనే మహిళ నివసిస్తోంది. కుమారుడు ప్రవీణ్తో ఆమెకు శనివారం రాత్రి గొడవ జరిగింది. మద్యం తీసుకురాలేదనే విషయంలో ఈ వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో తల్లిని ప్రవీణ్ కొట్టాడు. అంతే 52 ఏళ్ల మేరీ కోపంతో రెచ్చిపోయి, ఇంట్లోని సుత్తితో ప్రవీణ్ను కొట్టి చంపింది.
అనంతరం ఇంటికి తాళం వేసి, చుట్టుపక్కల వారికి తన కుమారుడు కనిపించడం లేదని, ఆ మరుసటి రోజు వరకూ చూసి గాలింపు మొదలు పెడతానని చెప్పింది. ఆ తర్వాత మాన్ఖుర్ద్లో ఉన్న చుట్టాలింటికి వెళ్లింది. అక్కడ ఉన్న భర్తకు కూడా అదే కథ చెప్పింది. కానీ అతనికి ఆమె మాటలు నమ్మబుద్ధి కాలేదు.
దీంతో ఇంటికెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడు కనిపించాడు. ఈ దృశ్యం చూసిన మేరీ భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మేరీని అదుపులోకి తీసుకున్నారు.