దేశ వాణిజ్య రాజధానిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడో దుర్మార్గుడు. అతను కూడా తనకు చాలా దగ్గరి స్నేహితుడే కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోకాటే పరమేశ్వర్ అనే వ్యక్తి ముంబైలో మెకానిక్గా పనిచేస్తున్నాడు.
అతని పొరుగింట్లో రాజు పాటిల్ అనే 28 ఏళ్ల యువకుడు ఉంటున్నాడు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులే. ఆ మధ్య ఒకసారి రాజు బంధువైన ఒక వ్యక్తికి.. పరమేశ్వర్ వంద రూపాయలు అప్పు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వంద రూపాయలు తనకు తిరిగిచ్చేయాలని పరమేశ్వర్ అడిగాడు. రాజు ఇవ్వనన్నాడు.
ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన పరమేశ్వర్.. రాజుపై చెయ్యి చేసుకున్నాడు. రాజు ప్రతిఘటించాడు. ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన పరమేశ్వర్.. రాజు పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం హత్య విషయాన్ని దాచిపెట్టేందుకు రాజు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టేసి తగలబెట్టాడు.
అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. రాజును ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే అతను అగ్నికి ఆహుతవడం వల్ల మరణించలేదని, వేరే కారణంతో మృతి చెందాడని చెప్పారు. దీంతో పరమేశ్వర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరపగా పరమేశ్వర్ తన తప్పు ఒప్పుకున్నాడు. ఈ కేసు స్థానికంగా సంచలనం రేపుతోంది.