కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ కథనం ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన గుడిపల్లి భాస్కర్ (51), ఫరూఖ్నగర్కు చెందిన నందిగామ జయమ్మ, ప్రయాణీకులు నరేశ్నాయక్, లాలాజీ ప్రసాద్ కొత్తూరు మున్సిపాలిటి పరిధిలోని తిమ్మాపూర్ చౌరస్తాలో గల బస్టాప్ వద్ద శుక్రవారం సాయంత్రం బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన కారు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వెళ్తుండగా తిమ్మాపూర్ చౌరస్తా వద్దకు రాగానే లారీని ఓవర్టెక్ చేయబోయి బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న గుడిపల్లి భాస్కర్, నందిగామ జయమ్మ, నరేశ్నాయక్, లాలాజీ ప్రసాద్లను కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో గుడిపల్లి భాస్కర్కు, నందిగామ జయమ్మకు తీవ్ర గాయాలు కాగా, నరేశ్నాయక్, లాలాజీలకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన భాస్కర్, జయమ్మను స్థానికులు 108లో షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో భాస్కర్ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. భాస్కర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.