యాచారం : వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు చైన్ను దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.12 లక్షల విలువగల బంగారం, కార్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండలంలోని మొగుళ్లవంపు గ్రామానికి చెందిన వృద్దురాలు కోయల్కార్ లక్ష్మీబాయి గతనెల 26న మండల కేంద్రంలోని మెడికల్ షాప్కు నడుచుకుంటూ వస్తుండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి మాటల్లో దింపి ఆమె మెడలోంచి 4 తులాల బంగారు చైన్ను దొంగలించుకుపోయారు. దీంతో పోలీసులను నిందితులను పట్టుకునేందుకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిందితుల వాహనాన్ని గుర్తుపట్టారు.
30వ తేదీన గున్గల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో వాహనంపై నిందితులు బోడ నవీన్, కాసుల మహేందర్రెడ్డి వస్తుండగా గమనించి వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో లక్ష్మీబాయి మెడలో బంగారం అపహరించినట్లు వారు అంగీకరించారు. ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో వీరి ముఠాలోని సభ్యుల సమాచారాన్ని యాచారం పోలీసులు సేకరించారు. వీరు బాలపూర్ మండలం నాదర్గుల్కు చెందిన బోడ నవీన్, కాసుల మహేందర్రెడ్డి, కరె దీపక్రాజు, నాగరాజులుగా గుర్తించి, అదేరోజు అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. పోలీసుల విచారణలో వారు నేరం అంగీకరించారు. గతంలో అనేక దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
వారి వద్ద నుంచి రూ.80వేల విలువగల బంగారు చైన్, 1.80 లక్షల విలువైన కేటీఎం బైక్, రూ.8లక్షల విలువగల ఇన్నోవా (ఏపీ27ఏఎన్0666) కారు, రూ.80 వేల విలువైన మారుతి 800 (ఏపీ09 ఏడబ్ల్యూ8734) కారు, రూ. 5లక్షల విలువగల మరో (టీఎస్08 యూబీ 9895) కారు, గొరెలు మేకలు అమ్మిన 70వేల నగదు, 2సామ్సంగ్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.